బొంబాయి హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడంతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుటుంబానికి పెద్ద ఉపశమనం లభించింది. షారూక్ ఖాన్ , గౌరీ ఖాన్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బొంబాయి హైకోర్టులో విచారణ సాగుతుండగా, గురువారం (నేడు) మూడవరోజు కేసు విచారించిన ధర్మాసనం ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేసింది.
ఎప్పటిలానే ఈ నేపథ్యంలోనూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. చాలా మంది ముకుల్ రోహత్గి వంటి అత్యంత ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరని అందుకే అమాయకులైన ఎంతో మంది జైళ్లలోనే అండర్ ట్రయల్స్ గా మగ్గిపోతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు కూడా ఆర్జీవీ ట్విట్టర్ లో తండ్రి కంటే ముందుగానే ఆర్యన్ ఖాన్ ని మీడియా, ఎన్సీబీలు లాంచ్ చేసి అగ్రస్థానం లో నిలిచాయని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సమయంలో ఆర్యన్ ఖాన్ తన తండ్రి దగ్గరి కంటే కూడా జైల్లోనూ, ఎన్సీబీ వద్దే జీవితం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఒక సూపర్ స్టార్ కొడుకును సూపర్ డూపర్ స్టార్ గా చేసినందుకు ఎన్సీబీకి ధన్యవాదాలు చెబుతూనే నేను షారుఖ్ ఖాన్ కి నిజమైన అభిమానిని అంటూ జై ఎన్సీబీ అని ట్వీట్ చేశాడు.